ఫోన్లో మాట్లాడటం తగ్గించాలన్న భర్తపై గొడ్డలితో దాడి చేసిన భార్య.. అల్లూరి జిల్లాలో దారుణం

  • భర్త మందలించడంతో భార్య ఆగ్రహం
  • గొడ్డలితో భర్తపై దాడి.. తీవ్ర గాయాలపాలైన భర్త
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
సెల్ ఫోన్ లో ఎక్కువగా మాట్లాడొద్దని భార్యను మందలించడమే ఆ భర్త చేసిన నేరమైంది.. ఈ మందలింపుతో ఆగ్రహించిన భార్య చేతికందిన గొడ్డలితో భర్తపై దాడి చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని మేడూరు గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన కొర్ర రాజారావు తన భార్య గంటల తరబడి ఫోన్లో మాట్లాడటంపై అభ్యంతరం చెప్పాడు. ఫోన్ లో మాట్లాడటం తగ్గించాలని భార్యను మందలించాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య మాటామాట పెరగడంతో రాజారావు భార్య ఆగ్రహంతో ఊగిపోయింది. ఇంట్లోని గొడ్డలి తీసుకుని రాజారావుపై దాడి చేసింది.

తీవ్రగాయాలపాలైన రాజారావును చుట్టుపక్కల వారు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి విశాఖపట్నంలోని కేజీహెచ్ కు తరలించగా.. చికిత్స పొందుతూ రాజారావు మరణించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు రాజారావు భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Wife Attacks on Husband
Alluri Sitarama Raju district
Chintapalli
crime news
Andhra Pradesh news
domestic violence

More Telugu News